సీఎం జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎంపీ

by Disha Web Desk 18 |
సీఎం జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎంపీ
X

దిశ ప్రతినిధి, గుంటూరు : నరసరావుపేట పార్లమెంట్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో 10 రోజుల్లో పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. వైసీపీకి చెందిన హేమాహేమీలు గా చెప్పుకునే నాయకులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో అధికార వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ నెల 22న టీడీపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన కృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో రెండు సార్లు సమావేశం అయ్యారు. తాను టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపి ఆయనతో చర్చించారు. ఏపీ రాజకీయాల్లో మంచి పేరున్న కృష్ణ దేవరాయలు పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు వెల్ కమ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దేవరాయలు 22న పసుపు కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పల్నాడు లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభలో చేరే ఆలోచన నడుస్తుంది. ఆ ఇద్దరు నాయకుల ప్రోగ్రామ్ ఎప్పుడు అనేది రెండు రోజుల్లో తెలియనుంది.

దేవరాయలు ఎంపీగా, వివాదరహితుడిగా అవినీతి మచ్చలేని వాడిగా మంచి పేరు ఉంది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సొంత వర్గాన్ని కూడగట్టుకున్నారు. ఆయన టీడీపీలో చేరితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆయనతో పాటు పల్నాడులోని గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరనున్నారు. జంగా వైసీపీలో బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రాష్ట్రంలోని బీసీ సంఘం నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆయన గురజాల టికెట్ ఆశించారు. వైసీపీ అధిష్టానం స్పందించకపోవడంతో పాటు ఎంపీ టికెట్‌ను తన సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్‌కు ఇచ్చింది. దీంతో ఖంగు తిన్న జంగా వైసీపీపై ధ్వజం ఎత్తారు. వైసీపీకి త్వరలో రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన టీడీపీలో చేరికతో గురజాల రాజకీయాలు మారనున్నాయి. అలాగే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కేన మల్లిఖార్జునరావు కూడా దేవరాయలు కలిసి టీడీపీ లో చేరనున్నారు. ఆయన ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. పై ఇద్దరు ప్రముఖుల తో పాటు పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు దేవరాయలు పాటు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వేదిక టీడిపి కేంద్ర కార్యాలయం ,పల్నాడు లో చంద్రబాబు,జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్న బహిరంగ సభలో అనేది తేలాల్సి ఉంది.

Next Story